Breaking

Friday, October 16, 2020

సూర్యోదయం దేనిని తెలియచేస్తుంది.

             




                           ప్రతి మనిషి గతాన్ని, చెడుని, కష్టాన్ని మర్చిపోయి కొత్త ఉత్సాహంతో కార్యసాధనకు ప్రయత్నించమని తెలియజేస్తుంది సూర్యోదయం. ధనసంపాదన విషయంలో పడి పెద్దలు ప్రకృతిని ఆస్వాదించడమే మర్చిపోయారు. కార్పొరేట్ చదువుల విషయంలో పడి చిన్న పిల్లలకు సూర్యోదయం, సూర్యాస్తమయం అనేటువంటివి సినిమాల్లో చూసి తెలుసుకుంటున్నారు. 

                 ఈరోజుల్లో మంచికానీ, చెడుకానీ తెలుసుకోవాలి అంటే జనాలు సినిమాల్లోనో, యూట్యూబ్లోనో  చూసి తెలుసుకునే పరిస్థితికి వచ్చారు. మరి పెద్దలు చెప్పిన మంచీచెడు, పుస్తకాల్లో తెలుసుకున్న జ్ఞానము ఇవన్నీ ఎక్కడికి వెళ్లాయి. ఆలోచించే సమయం లేదు. యంత్రంలా ధనసంపాదన కోసం పరిగెత్తడం తప్ప ఒక్క నిమిషం స్థిమితంగా కూర్చుని ఆలోచించే పరిస్థితి లేనేలేదు ఈ రోజుల్లో.

                               రాఘవ(45) తన భార్య రజిని (42) అస్తికలను కాశీలోని గంగా నదిలో కలిపి అలా ఒడ్డున కూర్చుని భార్య చెప్పిన మాటలలో కొన్ని విషయాలను గుర్తుచేసుకుంటూ అలా చూస్తూ ఉండిపోయాడు. పిల్లలు లేని మనకి నీకు నేను నాకు నువ్వు తప్ప ఈ ధనం ఎందుకు? ఇంత ధనం మనకెందుకు? చనిపోయినప్పుడు ఆరు అడుగుల స్థలం తప్ప ఏమి ఉపయోగపడవు. ఉన్న ధనంతో సంతోషంగా గడుపుదామని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోక ఒంటరి వాడిని అయ్యాను  అని బాధపడుతూ ఉంటాడు.

                              రజిని రాఘవకు చనిపోయేముందు ఒక ఫైల్ ఇచ్చిన విషయం గుర్తుకువచ్చి ఇంటికి వచ్చిన వెంటనే ఆ ఫైల్ తీసి దానిలోని కాగితాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అందులో ఒకే పేరు మీద ఉన్న బ్యాంక్ చలనాలను చూసి  డబ్బంతా  ఎవరికి పంపింది, ఎందుకు పంపింది తెలుసుకోవాలనే తపనతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా ఆ డబ్బంతా రజిని చిన్ననాటి మిత్రురాలు అయినా కావ్యకి పంపిందని ఆ బ్యాంకు అకౌంట్ నెంబర్ను బట్టి గుంటూరు జిల్లాలో శ్రీనివాసపురం అనే చిన్న గ్రామానికి చెందినటువంటిదని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు.

                          ఆ శ్రీనివాసపురంలో బస్సు దిగేసరికి  గ్రామమంతా పెళ్లికి సిద్ధమైన మండపం వలె పచ్చనిచెట్లు, పిల్లలు హడావుడిగా విశాలమైన క్రీడామైదానంతో కూడినటువంటి పాఠశాలకు వెళ్లడం చూసి ఆ పాఠశాల భవనాన్నిచూస్తూ ముందుకు నడుస్తూ పాఠశాల నిర్మాణ దాత తన భార్య అని తెలుసుకుంటాడు. అక్కడి ప్రజలు ఎవరిపని వారు చేసుకుంటూ ఒకరినొకరు సంతోషంగా పలకరించుకుంటూ కనపడతారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని కావ్య అంటే ఈ ఊర్లో ఎవరు? ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నిస్తాడు? ఆ వ్యక్తి రాఘవని ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వెళ్లేదారిలో త్రాగునీటి ట్యాంక్ని, ఆశ్రమాన్ని నిర్మించినది కూడా తన భార్య అని తెలుసుకుంటాడు.

         ఆశ్రమం లోపలికి వెళ్ళగనే కావ్య వచ్చిన వ్యక్తిని గుర్తించి   గ్రామంలోని  ప్రజలందరి తరపున కావ్య రాఘవకి ధన్యవాదాలు తెలియచేస్తుంది  ఈ ఆశ్రమం ఈరోజు ఇలా ఉంది అంటే దానికి మీరే కారణం. ఈ ఊరు ఇంత అందంగా తయారవడానికి కూడా మీరే కారణం అని చెప్పి తెలియజేస్తుంది. నా మీద నమ్మకంతో రజిని మేడం  ప్రతినెల కావలసిన ధనాన్ని అందజేశారు. మీ సహాయం లేకపోయి ఉంటే ఈరోజు ఈ గ్రామంలోని ప్రజలు, పిల్లలు కొత్త ఉదయాన్ని చూసి ఉండేవారు కాదేమో అంటూ ఇంతకు మేడం గారు రాలేదా అని ప్రశ్నిస్తోంది? తను స్వర్గాన్ని చేరి తను సాధించిన విజయాన్ని నాకు చూపించడానికి నన్ను ఇక్కడికి పంపినది అని తెలియజేస్తాడు.  

                 రాఘవని ఓదార్చుతూ పిల్లలు ఉంటే వారికి మాత్రమే తల్లిదండ్రులుగా ఉంటాము కానీ దేవుని అనుగ్రహంతో ఈ గ్రామంలోని ప్రజలందరిని తమ పిల్లలుగా స్వీకరించే అదృష్టం మీకు మాత్రమే దక్కింది అని కావ్య తెలియజేస్తుంది. ఇది ఎలా సాధ్యపడింది అని రాఘవ అడుగగా ఈ ప్రాంతంలో పిల్లలను చదివించుకోలేక, పంటల పండక ప్రజలు పడుతున్న కష్టాలను చూసి నేను కావ్య మేడమ్ కి ఉత్తరం రాశాను దానికి సమాధానంగా తనే స్వయంగా వచ్చి నెల రోజులు ఉండి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, నాకు పదిలక్షలు ధనాన్ని ఈ గ్రామ రక్షణ కోసం ఇచ్చి అప్పటినుండి ప్రతినెల నాకు ధనాన్ని పంపుతూనే ఉంది అని తెలియజేసింది.

          కావ్య చెప్పిన మాటలు విని రాఘవకి గతం గుర్తుకువచ్చింది ఒక ఐదు సంవత్సరాల కిందట పదిలక్షలు తీసుకొని తన మిత్రురాలు దగ్గరికి ఫారిన్ వెళ్ళింది కానీ తిరిగి వచ్చాక అక్కడి విషయాలు అడిగితే ఏమి చెప్పకుండానే ఎప్పటికప్పుడు మాట  దాటేస్తూ వచ్చింది. అంటే తను వచ్చింది ఇక్కడికే ఆడబ్బు ఖర్చు పెట్టింది ఇక్కడే అని నిర్ణయించుకున్నాడు.  నాభార్య ఆలోచన తెలుసుకుని, ప్రజల కష్టాలను అర్థం చేసుకుని  నేను కూడా మిగతా జీవితాన్ని ఇదే ఆశ్రమంలో ఉంటూ నాకు సాధ్యమైనంత సహాయాన్ని ఈ గ్రామ అభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలి అప్పుడే చనిపోయిన నాభార్య కూడా సంతోషిస్తుంది అని నిర్ణయించుకున్నాడు.

          రాఘవ తను అనుకున్న పని ప్రారంభించిన సంవత్సరానికి శ్రీనివాసపురాన్నే కాదు ఆమండలాన్నే ఆ రాష్ట్రంలో ఉత్తమమైన మండలంగా పచ్చని చెట్లతో సుందరంగా, విద్యార్థుల కోసం పాఠశాలలు, గ్రంధాలయాలు నిర్మించి తను కూడా విజయం సాధించాడు.

          ఈ కథలో ధన సంపాదనే లక్ష్యంగా ఉన్న మనిషికి భార్య మరణించినా ఒక కొత్త ఉదయాన్ని చూపించింది.

1. ఈ కథను క్రింద ఉన్న సోషల్ మీడియా ద్వారా మిత్రులకు పంపవచ్చు.

No comments: