Breaking

Thursday, October 8, 2020

యవ్వనం ఎటువైపుకు దారి తీస్తుంది

   


           

               మానవుడు అనేపదానికి సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి అందులో ఒకటి "నరః" (న రీయతే) దీని ప్రకారం  "రః" అంటే నాశనము, మరి "న" అంటే లేదు అని అర్థం. అంటే నాశనము లేనిది అని అర్థం. ఈ సృష్టి ఉన్నంతవరకు నరుడు ఉంటాడు. నరుడు ఉన్నంతవరకు ఇష్టాలు, కోరికలకు నాశనం లేదు. వయస్సు పెరిగినా నిత్య యవ్వనుడే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని, జీతం వైపా, మనో విజ్ఞానం వైపా, మానసిక ఆనందం వైపా నిర్ణయించేది ఒక్క యవ్వనం మాత్రమే.

        ఒకప్పుడు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో ఉపాధ్యాయులు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సంతోషాన్ని కల్పించకపోయినా విద్యార్థులకు మంచి విషయాలను తెలియజేసి, తప్పు చేస్తే అవి సరిచేసి సంతోషాన్ని కల్పించుకునేవారు. పెద్దలు ఇప్పటికీ మా గురువులు గొప్పవారు, మంచివారు అని అంటారు. ఎప్పటికీ గురువు గురువే. స్వార్థం లేని మిత్రుడు. ఇప్పటివరకు ఉన్న పెద్దలు  వారి కాలం గురించి గొప్పగా చెప్పుకుంటారు. మరి ఇప్పుడు చెప్పే ఉపాధ్యాయులకు తప్పు చేస్తే దండించే పరిస్థితి లేకుండా పోయింది. మంచి విషయాలను చెప్పవలసిన అమ్మమ్మ తాతయ్యలు కొడుకులకు, మనవడులకు దూరంగా బతుకుతున్నారు. ఒకవేళ ఇంట్లోనే ఉన్నా తల్లిదండ్రుల గారాబంతో పెద్దలు చెప్పిన మంచి చెడులను వినేవారు తగ్గిపోయారు.

                   "మనం ఇల్లు కట్టాలి అంటే పునాది బలంగా వేస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో పైన మరో రెండు లేదా మూడు అంతస్తులు వేయొచ్చు కాబట్టి. సరే పునాది బాగా వేసి స్లాబు బలంగా వెయ్యకపోతే నష్టం ఎవరికి ఇంటి యజమానికేనా" అదేవిధంగా పిల్లలకి చదువు బాగా రావాలని పట్టణంలో గొప్ప బడి వెతుకుతాం. కానీ పిల్లలు చేసే తప్పులను గమనించం. బడిలో తప్పు చేస్తేనో లేక చదవకపోతేనో పిల్లవాడిని కొట్టే గురువు పైకి గుంపులతో వెళ్తాం ఇది ఈనాటి చాలామంది ప్రజల పరిస్థితి. 

                     ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తప్పు చేస్తే దండించే గురువుని ఎప్పుడైతే మనం పిల్లవాడికి దూరం పెడతామో అప్పుడే పిల్లవాడు తల్లిదండ్రుల అతి ప్రేమతో తప్పులు చేయడం ప్రారంభిస్తాడు. మన ప్రేమ  పిల్లలకు బలం కావాలి కానీ బలహీనతతో తప్పులు చేయకూడదు. మీరందరూ చెప్పచ్చు మా వాడు మంచివాడు అని, కానీ పెద్దలు ఊరకనే అనలేదు దొరికితే దొంగ దొరకకపోతే దొర ఈ సామెతని పునరావృతం చేస్తూ ఉంటారు. 

          యవ్వనం మిగతా జీవితానికి పునాది. కాబట్టి యవ్వనంలో ప్రతి మానవుడు నాయకుడే(హీరో). కానీ వారి ఆలోచనలు ప్రతినాయకుడు (విలన్). ఆ యవ్వనంలో వారి స్నేహం, వారి ఆలోచనలు వారిని మంచి స్థానంలో నిలబెట్టడానికి లేదా పాతాళ లోకానికి పడిపోవడానికైనా కారణమౌతుంది. మొక్కై వంగనిది మానై వంగునా యవ్వనంలో తప్పు చేసినప్పుడు దండించేవారు లేకపోతే వాడి గతి అథోగతి. 

        తలరాతలు బ్రహ్మదేవుడు రాస్తాడు అంటారు. రాసిన రాతను మార్చలేము అలాగని వదిలేయ్యలేము. కానీ ఈ రోజులలో జరుగుతున్న హత్యలకు, ముఖ్యంగా అరాచకాలకు, దొంగతనాలకు ఎంతమంది పోలీసులు ఉన్నా అది వ్యర్థం. దానికి కారణం వందలో 10-15% అయినా ఆ ఇంటి పెద్దల వంతు ఉంటుంది. ఎందుకంటే బాల్యంలో మంచి చెడులను తన పిల్లలకు  తెలియచేయవలసిన  భాధ్యత తండ్రిది.  ఆ బాధ్యతను పిల్లల మీద అతిప్రేమతో తండ్రి ఎప్పుడైతే చేయలేకపోతాడో అప్పుడు సమాజాన్ని మంచి దారిలో నడిపించడం అసాధ్యం.

                 ఈ రోజులలో 16 నుంచి 22 సంవత్సరాల మధ్యలో పిల్లలు చదువుతోపాటు ధన సంపాదన చేస్తున్నారు. ధన సంపాదన మంచిదే. కానీ అంతకన్నా విలువైనది, గొప్పది విద్య. విద్య అంటే పేపర్ల మీద వచ్చే మార్కులు కాదు. విద్య అంటే జ్ఞానం. అదో మహాసముద్రం. సముద్రంలోని నీటికి చదువులో జ్ఞానానికి కొలతలేదన్నారు. సాధారణంగా విద్య ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు అంటారు. కానీ యవ్వనంలోని విద్య ఉన్నత శిఖరాలకు నిచ్చెన వంటిది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక వ్యక్తి మంచి ఉద్యోగాన్ని పొందాలన్నా, మంచి కుటుంబం ఏర్పాటు చేసుకోవాలన్నా, బాల్యం, యవ్వనంలలో చదివిన విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

           "మనం చెప్పుకున్న విషయాల్లో పెద్దలు పిల్లలకి ఆస్తులను ఇవ్వాల్సిన పనిలేదు. కేవలం మంచి మంచి ఆశయాలను ఆలోచనలను ఇస్తే చాలు" ఈ విషయాన్ని మాత్రమే గమనించండి. యవ్వనం ఒక అందమైన కల. ఆ అందమైన కలని ఇంకా అద్భుతంగా మధురంగా మీరందరూ నిర్మించుకోవాలని ఆశిస్తున్నాను.

               చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు కాబట్టి అందరూ ఆలోచించండి.

1. మిత్రులకు ఒక చిన్న విన్నపం. క్రింద ఉన్న గంట గుర్తును నొక్కడం వలన నా బ్లాగ్ నుండి వచ్చే ప్రతి ఆర్టికల్ గాని లేదా కథ గాని ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.

2 ఈ ఆర్టికల్ లేదా కథని కింద ఉన్న వాట్సప్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.

3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.